హిందూ ఆలయానికి రక్షణగా నిలిచిన ముస్లిం యువకులు


కర్ణాటకలోని బెంగళూరులో ముస్లిం యువకులు మానవ హారంగా ఏర్పడి హిందూ ఆలయానికి రక్షణగా నిలిచారు. డీజే హాళ్లికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు ఒక వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుపై ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు.

మంగళవారం రాత్రి ఆందోళనకారులు ఆ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనలో ఏసీపీ సహా 60 మంది పోలీసులు గాయపడ్డారు.

మరో ప్రక్క ఈ అల్లర్ల నేపథ్యంలో కొందరు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటారు. డీజే హాళ్లి ప్రాంతంలోని ఒక హిందూ ఆలయంపై ఆందోళనకారులు దాడి చేయకుండా దాని చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ముస్లిం యువకుల చొరవను పలువురు నెటిజన్లు కొనియాడారు.