ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం మరో అడుగు ముందుకు వేశానని
ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తామని చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు బిగిస్తామని
ప్రకటించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమానికి
శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు
కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
రాష్ట్రంలో 2 లక్షల బోర్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు
సీఎం జగన్ తెలిపారు. 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ
అర్బన్ ప్రాంతాల్లో ఈ పథకం అమలు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున బోరు వేసే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు
చెప్పారు. రాబోయే 30 ఏళ్లలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకే
మీటర్లు బిగిస్తున్నట్లు ఆయన వివరించారు.
‘‘రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తాం. అయితే
మేనిఫెస్టోలో లేకపోయినా సరే చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకు బోర్లతో పాటు
మోటార్లు కూడా బిగిస్తాం. దీనికోసం అదనంగా రూ.1600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి
నియోజకవర్గంలో బోరు రిగ్గు ఏర్పాటు చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు. రైతులు ఆన్లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని లేదంటే వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లోనూ
దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. బోరు వేసేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే
భరిస్తుందని వివరించారు. మొదటి బోరు విఫలమైతే రెండోసారి వేయాలని అధికారులను
ఆదేశించామన్నారు. అలాగే వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేశామని, రైతు
భరోసా కేంద్రాల ద్వారా 48 గంటల్లో విత్తనాల సరఫరా చేస్తున్నామని సీఎం జగన్
పేర్కొన్నారు.