మార్కెట్ మండీలు, పీడీఎస్, కనీస
మద్దతు ధర అంశాలను బలోపేతం చేయాలన్నారు రాహుల్ గాంధీ. కానీ నరేంద్ర మోదీ
నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ వ్యవస్థ బలోపేతానికి పని చేయడం లేదని విమర్శించారు. ఆ వ్యవస్థలను మోదీ నాశనం చేస్తున్నారని, వ్యవసాయ చట్టాలతో ఆయన రైతులను చంపేస్తున్నారని
రాహుల్ గాంధీ ఆరోపించారు. ధాన్యం సేకరణ కోసం మండీల్లో ఉన్న వ్యవస్థల్లో
కొన్ని లోపాలు ఉన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. పాటియాలా జిల్లాలోని సంగ్రూర్లో
జరిగిన కిసాన్ బచావో ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరేండ్ల నుంచి మోదీ ప్రభుత్వం
ఢిల్లీని పాలిస్తున్నదని, ఆరేండ్ల నుంచి పేదలు, కార్మికులు, రైతులపై
ఆక్రమణ చేస్తున్నదని, మోదీ సర్కార్
చేస్తున్న ప్రణాళికల వల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదన్నారు. మోదీ చేస్తున్న
చట్టాలన్నీ ఆయనకు దగ్గరగా ఉన్న
కొందరు మిత్రులకు ఉపకరిస్తుందని ఆరోపించారు. కరోనా మహమ్మారి వేళ మూడు వ్యవసాయ
బిల్లులను పాస్ చేశారని, ఈ సమయంలో
ఆ బిల్లులను హడావుడిగా పాస్ చేయడం అవసరం ఏంటని, రైతులు
ఏమీ చేయలేరన్న ఉద్దేశంతోనే వాళ్లు ఆ బిల్లులు తీసుకువచ్చారని, కాని
వారికి రైతు శక్తి ఏంటో తెలియదని రాహుల్ పేర్కొన్నారు.