కరోనా నిబంధనలు జనవరి 31 వరకు పొడిగించిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ


కరోనా నిఘాకు సంబంధించిన మార్గదర్శకాలు 2021 జనవరి 31 వరకు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో జారీ చేసిన నిబంధనలను అప్పటి వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం పేర్కొంది.

దేశంలో వైరస్‌ కొత్త కేసులు, క్రియాశీల కేసులలో నిరంతర క్షీణత ఉన్నదని తెలిపింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల, బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కరోనాపై నిఘా, నియంత్రణ పట్ల జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ జోన్ల గుర్తింపును కొనసాగించాలని, ఆ ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.