ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద గర్భిణీ స్త్రీలకు , పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ పథకాన్నిపారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్యలక్ష్మి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి సమాధానం ఇచ్చారు.
ఈ పథకం కింద పాలు, గుడ్లతో పాటు పప్పు, ఆకు కూరలు అందిస్తున్నామని చెప్పారు. కొవిడ్ నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటికెళ్లి పోషకాహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. పౌష్టికాహారం లోపం ఉన్న పిల్లలకు అదనంగా పాలు సమకూర్చతున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని దేశంలో ఏ రాష్ర్టం కూడా అమలు చేయడం లేదు. రాష్ట్రంలో దాదాపు 12 వేల అంగన్వాడీలు ఉన్నాయి. వీటికి అదనంగా మరిన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
చెడిపోయిన గుడ్లను సరఫరా చేస్తే వారికి బిల్లులు ఆపమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గర్భిణి స్ర్తీలను తరలించేందుకు అమ్మ ఒడి వాహనాలను సమకూర్చామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.