ఉగ్రదాడిలో వీరమరణం పొందిన రాడ్యా మహేశ్కు ఐటీ మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. మహేశ్ త్యాగం మరువలేనిది అని పేర్కొన్నారు.
మహేశ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. రాడ్యా మహేశ్ మృతిపై డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు అన్నారు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేమని డీజీపీ పేర్కొన్నారు.
ర్యాడా మహేష్ మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ స్పందిస్తూ.. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరి భారతావని కోసం మహేష్ చేసిన త్యాగం మరువలేనిదన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు మహేష్ కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుందన్నారు.
మహేష్తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు జోహార్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.