చంద్రబాబు పై కొడాలి నాని సంచలమైన విమర్శలు చేసారు

మంత్రి కొడాలి నాని గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అండ్‌ కో పై సంచలమైన కామెంట్స్ చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్‌ కో బాగుపడ్డారని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని టీడీపీ నేతలకు ముందే తెలుసునని చెప్పారు. భూములు కొనుగోలు చేసుకోవాలని టీడీపీ నేతలకు బాబు ముందే చెప్పారని ఆరోపించారు.

రాజధానిలో రైతులను మోసం చేసి ఎకరం రూ.25లక్షలకు కొనుగోలు చేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్త చేశారు. టీడీపీ నేతలు రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుంభకోణంపై కేబినెట్ సబ్‌ కమిటీ, సిట్‌ నియమించారు. గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరాం.

కరోనా వల్లో లేకపోతే సీబీఐకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉండటంతోనో జాప్యం జరిగింది. కేంద్రం నిర్ణయం రాకపోవడంతో ఏసీబీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. చంద్రబాబు, అతని బినామీలు లాయర్లకు కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించి.. కోర్టులో వారి పేర్లు బయటకు రాకుండా స్టేలు తెచ్చుకున్నారు. చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్.

ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసు. బాబు ప్రమేయం ఉందని తేలితే ఆయన మీద కూడా కేసులు పెడతారు. చంద్రబాబుకు ప్రజలు ముందే శిక్ష వేశారు. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉంటూ జైలు జీవితం గడుపుతున్నారు. బాబు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ప్రజల నుంచి శిక్ష తప్పదు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి వ్యవస్థలోనూ సొంత మనుషులను పెట్టుకుని.. వాళ్లను అడ్డం పెట్టుకుని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.