లాక్ డౌన్ కారణంగా వివిధ
ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ‘శ్రామిక్
స్పెషల్’ రైళ్లను కేంద్రం నడుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, మే 9 నుంచి
27 వరకు ఈ రైళ్లలో ప్రయాణించిన వలస కార్మికుల్లో 80 మంది మరణించినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
(ఆర్పీఎఫ్) సమీక్షలో వెల్లడయ్యింది. ఆకలి, వేడి, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరంతా మరణించినట్టు
ఆర్పీఎఫ్ తెలిపింది.
మే 1 నుంచి 27 వరకు
రైల్వే 3,840 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపి,
50 లక్షల మంది వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు
చేర్చిందని పేర్కొంది. శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వలస కార్మికుల్లో ఎవరైనా
అనారోగ్యానికి గురైతే రైలును ఆపి సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స
అందిస్తున్నట్టు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఎవరైనా ప్రాణాలు
కోల్పోవడం తీరని లోటని అన్నారు.
అనారోగ్యానికి గురైన
వారిని హాస్పిటల్కు తరలించడంతోపాటు పలువురు గర్బిణిలకు రైల్వే ఆస్పత్రుల్లో ప్రసవాలు
కూడా జరుగుతున్నాయన్నారు. కానీ రైళ్లలో ఆహారం దొరక్క మాత్రం ఎవరూ మరణించలేదన్నారు.
నార్త్ఈస్టర్న్ రైల్వేలో 18 మంది, నార్త్ సెంట్రల్ జోన్లో 19 మంది, ఈస్ట్కోస్ట్
రైల్వేలో 13 మంది
ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. శ్రామిక్ రైళ్లలో మరణించినవారి ప్రాథమిక జాబితా
రూపొందించామని, రాష్ట్రాల
సమన్వయంతో తుది జాబితా త్వరలోనే వెల్లడిస్తామని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.
శ్రామిక్ రైళ్లలో 80 శాతం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే నడుస్తున్నాయని పేర్కొన్నారు.
వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించడానికి దేశవ్యాప్తంగా శ్రామిక్ స్పెషల్స్ను
నడుపుతున్నాం. ఈ సేవలను పొందుతున్న కొందరికి ముందు నుంచి అనారోగ్య సమస్యలు
ఉన్నాయని గమనించాం ఇది కోవిడ్ -19
మహమ్మారి సమయంలో వారు ఎదుర్కొనే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణించే సమయంలో కొన్ని
దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారు అని రైల్వే శాఖ వ్యాఖ్యానించింది.
శ్రామిక్ స్పెషల్స్లో
ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలలో వేడి, అలసట, దాహం
ఎక్కువగా ఉన్నాయి. గత నెలలో ఇలాంటి అనేక కేసులను మేము చూశాం అని ఒక జోనల్ రైల్వే
అధికారి అన్నారు. ఆర్పీఎఫ్ గణాంకాల ప్రకారం ఉత్తర రైల్వే జోన్లో 10 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య గురించి నాకు
తెలియదు కానీ, కొన్ని
సందర్భాల్లో ఒక వ్యక్తికి గుండెపోటు, ఒకరికి
రక్తపోటు వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని మాకు తెలుసు. కానీ మరణాలకు ప్రధాన
కారణం ఆకలి అని చెప్పడం సరైంది కాదు అని నార్తరన్ రైల్వే ప్రతినిధి చెప్పారు.
ప్రయాణికులను కాపాడటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము.