ప్రపంచం మొత్తం
మహమ్మారిని అంతం చేసే టీకా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది. కరోనాకు సమర్ధవంతమైన
టీకా అందుబాటులోకి రావాలని ప్రార్ధనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దేవుళ్లను
వేడుకుంటున్నారు. తాజాగా, వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రావాలని, కరోనా
లేని ప్రపంచం కోసం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గురువారం పూజలు చేశారు.
కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా సోలాపూర్లోని పంధరిపుర్లో విఠల్ ఆలయాన్ని
సతీసమేతంగా సందర్శించిన ఆయన మహాపూజ నిర్వహించారు. అనంతరం అజిత్ పవార్ మీడియాతో
మాట్లాడుతూ...‘కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మా
పరిస్థితి కూడా అలాగే ఉంది. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రపంచం
వ్యాధి నుంచి విముక్తి పొందుతుంది’అని పేర్కొన్నారు. కొద్ది నెలల కిందట రాష్ట్రంలో
కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నట్లే కనిపించాయని, కానీ, గత
కొద్ది రోజులుగా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేవుడు ఈ సంక్షోభానికి
ముగింపు పలుకుతాడని, అయితే, ప్రజలు మాత్రం మాస్క్లు ధరించడం, చేతులు
శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించాలని అభ్యర్థించారు. ఈ
ఏడాది భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వానికి శక్తిని
ప్రసాదించాలని వేడుకున్నామని అన్నారు. అలాగే,
2008 ముంబయి దాడులు అమరవీరులకు నివాళులర్పించారు. దేశం
కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు, యువతను మహారాష్ట్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని
కొనియాడారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేసింది.
ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 17,95,959 మంది వైరస్ బారిన పడ్డారు. గురువారం కొత్తగా 6,406
కేసులు నిర్దారణ కాగా మరో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా
కరోనా కేసులు, మరణాలు మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి.