లియాండర్ పేస్ ..దాదాపు రెండు దశాబ్దాలుగా భారత టెన్నిసుకు ముఖ చిత్రంగా మారిన ఆటగాడు..ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్లో కాంస్య పథకం గెలుచుకుని రికార్డు సృష్టించిన పేస్ డబుల్స్ , మిక్స్డ్ డబుల్స్ లో పద్దెనిమిది గ్రాండ్స్లామ్స్ సాధించాడు ..రికార్డు స్థాయిలో ఏడు సార్లు ఒలింపిక్స్లో పాల్గొని , ఎనిమిదో ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నాడు ..వయసు పెరిగే కొద్దీ పేస్ లో పదును పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ..తనతో జోడి కట్టిన మహేష్ భూపతి వంటి వాళ్ళు ఎప్పుడో ఆటను వదిలేస్తే , పేస్ మాత్రం ఇంకా యువకులతో పోటీ పడుతున్నాడు ..
అయితే లాక్డౌన్లో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నానని భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ చెప్పాడు. ఆటను పునరుద్ధరించాక సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నానన్నాడు. ఈసారి టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని గ్రాండ్గా వీడ్కోలు చెబుతానని ఏడాది ఆరంభంలో పేస్ ప్రకటించాడు. కానీ, కరోనా కారణంగా విశ్వక్రీడలు వచ్చే ఏడాది జూలైకు రీషెడ్యూల్ కావడంతో అప్పటివరకు తన రిటైర్మెంట్ను వాయిదా వేసుకున్నట్టుగా అనిపిస్తోంది. ‘నా సుదీర్ఘ ప్రస్థానం, వారసత్వానికి తగ్గట్టుగా ఒలింపిక్స్తో గ్రాండ్గా ముగిద్దామనుకున్నా. కరో నా కారణంగా అంతా మారిపోయింది. కానీ, ఈ లాక్డౌన్ సమయంలో నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకున్నా. ఇప్పుడు నాన్నతో ఎక్కువ సమయం గడపడానికి ఎంతో సమయం లభించింది’ అని భారత చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వెబినార్లో 47 ఏళ్ల పేస్ చెప్పాడు.
టెన్నిస్ రీస్టార్ట్ అయిన తర్వాత పేస్ కొత్త వెర్షన్ను చూస్తారన్నాడు. ‘మునపటి స్థాయిలో సత్తాచాటేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నా. కచ్చితంగా ఈసారి అద్భుతమైన ప్రదర్శనతో కెరీర్కు ముగింపు పలుకుతా‘ అని లియాండర్ చెప్పుకొచ్చాడు. తనకు ఇష్టమైన వాటిల్లో క్రీడా విద్య కూడా ఒకటని చెప్పాడు. అయితే, ఫిజికల్ ఎడ్యుకేషన్ కారణంగా పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని తానైతే భావించడం లేదన్నాడు. తన లాంటి స్పోర్ట్స్ ఎడ్యుకేటర్స్ లేదా స్పోర్ట్స్ సైకాలజిస్టులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పీటీ క్లాసుల్లో పాల్గొని చిన్నారుల జీవితాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయో? లేదో? అనే ఆందోళనను పేస్ వ్యక్తం చేశాడు.