మునిసిపల్ ఎన్నికల
ప్రచారం తీవ్ర రూపం దాల్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల
తీరుపై రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. బీజేపీ నేతలకు స్థానిక
అంశాలపై మాట్లాడటం ఇష్టం లేనట్టుందని మంత్రి ఎద్దేవా చేశారు. వారు పాతకాలపు
విషయాలను, దైవ సంబంధ అంశాలను మాటిమాటికి వల్లెవేస్తున్నారని, అడుగడుగునా
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
బీజేపీ నేతలు బాబర్, అక్బర్, బిన్లాడెన్ గురించి ప్రస్తావిస్తున్నారని, వాళ్లేమైనా
హైదరాబాద్ ఓటర్లా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు చీటికిమాటికి
బాబర్, అక్బర్, బిన్లాడెన్
పేర్లు కలువరిస్తున్నారు.
కానీ, బీజేపీ
నేతలు వాళ్ల పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు.
వాళ్లేమీ హైదరాబాద్ ఓటర్లు కాదు కదా..! అని మంత్రి చమత్కరించారు. బీజేపీ నేతలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు గల్లీ ఎన్నికలు అనే సంగతిని మర్చిపోయినట్లున్నారని
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ స్థాయి బీజేపీ
నాయకులు వస్తున్నారని, ఇంకా అంతర్జాతీయ నాయకులు కూడా వస్తరేమోనని ఆయన
ఎద్దేవా చేశారు. డొనాల్డ్ ట్రంప్ బీజేపీ నేతల దోస్తు కాబట్టి ఆయన కూడా హైదరాబాద్
ఎన్నికల ప్రచారానికి వస్తడేమో అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు
మాత్రం ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం చాలని మంత్రి పేర్కొన్నారు.