జీహెచ్ఎంసీ ఎన్నీకలకు
అన్ని పార్టీలు తయారవుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ
పోటీ చేస్తుందని తెలిపారు. అయితే ఈ ఎన్నికలలో కలసి పోటీచేయడానికి గల అవకాశాలను
పరిశీలించాలని జనసేన, భారతీయ జనతా పార్టీలు నిర్ణయించాయి. ఇందులో
భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్
కళ్యాణ్ను బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, ఆ పార్టీ అగ్ర నేతలు
కలవనున్నారు. ఈ నిర్ణయంతో ఇరు పార్టీల కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరో వైపు బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
అయితే ఈ నేపథ్యంలో
వీరిద్దరి భేటీపై కీలక చర్చ జరుగుతోంది. మరి పవన్ కళ్యాణ్తో భేటీలో ఇరుపార్టీలు
ఏయే అంశాలపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలు చేస్తున్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీలో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చిన విషయం
తెలిసిందే. తెలంగాణ, జీహెచ్ఎంసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న పార్టీ
కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విజ్ఞప్తులు
వచ్చాయన్నారు. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి రెడీ కావాలని
పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశానని పవన్ కళ్యాణ్
తెలిపారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో
పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయన్నారు.