తల్లితండ్రులలో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ..పవన్ కళ్యాణ్


ఈ కరోనా సమయంలో పరీక్షలకు వెళ్లాలంటే విద్యార్థులకు భయంగా ఉంది అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ మాట్లాడుతూ... ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలి అని తెలిపారు.

అయితే కరోనా మూలంగా మార్చి నెల నుంచి విద్యాసంస్థలు మూతపడ్డ క్రమంలో తమకు సెమిస్టర్ పరీక్షల సమాచారం కూడా సక్రమంగా ఇవ్వకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేయడంపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లాలంటే భయంగా ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు అని పవన్ అన్నారు.

సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులు ఏ మేరకు సన్నద్ధమై ఉన్నారో కూడా జె.ఎన్.టి.యూ. వర్గాలు కూడా సరిగా అంచనాకు రాలేదు. విద్యార్థులు తమ ఆవేదనను సంబంధిత విశ్వవిద్యాలయాలకు చెబుతున్నా స్పందించకుండా పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్ళడం సరి కాదు అని సూచించారు. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు, సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో అనుసరించిన విధానాలను, యూజీసీ మార్గ దర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.