సాధారణంగా జలుబు చేసినప్పుడు వేడి నీటితో ఆవిరి పడుతుంటారు. కొందరు ఆ నీటిలో పసుపు, అమృతాంజన్ లేదా జిందా తిలిస్మాత్ వంటి మందులు వేసి ఆవిరి పడుతారు. ఆ అలవాటు కరోనా చికిత్సలో అద్భుతంగా పనిచేస్తున్నదని ముంబైలోని సెవెన్హిల్స్ దవాఖాన వెల్లడించింది. తాముచేసిన పరిశోధనలో సత్ఫలితాలు వచ్చినట్టు ఆ దవాఖానకు చెందిన వైద్యబృందం సంతోషం వ్యక్తంచేస్తున్నది.
ఆవిరిపట్టడం వల్ల ఎలాంటి వ్యాధి లక్షణాలులేని పాజిటివ్ వ్యక్తులు ఏడురోజుల్లో, లక్షణాలు ఉన్న వారు ఏడు నుంచి 10 రోజుల్లో కోలుకున్నట్లు వీరి అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ, మధ్యస్థ, లక్షణాలున్నవారు, వైరస్ సోకి ఎలాంటి లక్షణాలులేని వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించి పరిశోధన నిర్వహించారు. మొదటి గ్రూప్లో ఉన్నవారు రోజుకు రెండుసార్లు 5 నిమిషాలపాటు ఆవిరిపట్టేలా చర్యలు తీసుకోగా, రెండో గ్రూప్ వారు ప్రతి 3 గంటలకు ఒకసారి 5 నిమిషాలపాటు ఆవిరిపట్టాలని సూచించారు.
ఇలా 14 రోజుల నుంచి 2 నెలలపాటు పరిశీలిస్తే వీరిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. రెండు గ్రూపుల్లో ఉన్నవారిని పరిశీలిస్తే స్వల్ప లక్షణాలున్న వారు 7 రోజుల్లో కోలుకుంటే, మధ్యస్థ లక్షణాలున్నవారు 7 నుంచి 10 రోజుల్లో కోలుకున్నట్టు స్పష్టమైంది. ఆవిరి చికిత్స ప్రారంభించిన తర్వాత ఊహించని విధంగా లక్షణాలు తగ్గుముఖం పట్టాయని వైద్యులు తెలిపారు. డాక్టర్ దిలీప్పవార్ ఆధ్వర్యంలో మే, జూన్ నెలల్లో కరోనా సోకినవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు.
మేం తొలుత టోసిలిజుమాబ్ ఇంజెక్షన్తో చికిత్స అందిస్తే 80% మంది కోలుకున్నారు. ముక్కు, నోరు, కండ్ల నుంచి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించాం. ఆవిరిపట్టడం మనం సాధారణంగా ఇండ్లలో చేసే సొంత చికిత్స. దీన్ని కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించి చూశాం. ఆవిరిలో 70 నుంచి 80 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో భారం తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే 56-60 డిగ్రీల ఉష్ణోగ్రత తగలగానే వైరస్ చనిపోతుంది’ అని దిలీప్పవార్ స్పష్టంచేశారు.