కరోనా వాక్సిన్ ట్రయల్స్
ఇప్పుడు చివరి ఘట్టంలో వున్న విషయం తెలిసిందే. ఈ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే
సంస్థలకు హ్యాకర్ల ముప్పు ఉందని ఐబీఎం తెలిపింది. వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఒక
ఆందోళనైతే ఇప్పుడు మరో టెన్షన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు
సిద్ధమవుతున్న తరుణంలో హ్యాకర్ల ముప్పు ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. ప్రపంచదేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు
ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని వ్యాక్సిన్లు
మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి
రానున్నాయి. ఈ తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థలకు హ్యాకర్ల
ముప్పు ఉందని ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం హెచ్చరించింది. వ్యాక్సిన్ రవాణా చేసే
సంస్థల డేటా కోసం అంతర్జాతీయ హ్యాకర్ల బృందం టార్గెట్ చేయనున్నట్టు ఐబీఎం
తెలిపింది. నిపుణుల బృందం హ్యాకర్ల కదలికలపై అనుమానం వ్యక్తం చేసినట్టు ఐబీఎం
స్పష్టం చేసింది. ఇందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని తెలిపారు.
ఇందుకోసం ప్రస్తుతం
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యాక్సిన్ కోల్డ్ ఛైన్ అంశంపై సమాచారం
సేకరించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బృందం
గుర్తించిందని ఐబీఎం వెల్లడించింది. వివిధ రకాల హైయర్ రిఫ్రిజిరేటర్ యూనిట్ల తయారీ, మోడల్ , ధరలపై
హ్యాకర్ల పరిశోధన కొనసాగుతోంది. డేటా కోసం ఈ మెయిల్ రూపంలో వల విసురుతున్నారు.
పక్కా ప్రణాళికతో డేటా తస్కరణ కోసం హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ మెయిల్స్
అన్నింటినీ చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ సంస్థ ప్రతినిధి పేరుతో పంపుతున్నట్టు
ఐబీఎం గుర్తించింది. ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను మైనస్ 70
డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాలని ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇదే మెయింటైన్
చేయాలని ఐబీఎం తెలిపింది. ఈ క్రమంలో ఫైజర్ బయోన్టెక్ కంపెనీలు ఎలాంటి చర్యలు
తీసుకుంటున్నాయో పరిశీలిస్తున్నామని ఐబీఎం వెల్లడించింది. వాక్సిన్ కోసం చాలా
దేశాలు ఇప్పటికే కొన్ని కంపెనీలతో కాంట్రాక్టు చేసుకున్న సంగతి తెలిసిందే.