స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్ కోసం తొందరపడొద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. తొడ కండరాల గాయంతో రోహిత్ వరుసగా నాలుగు ఐపీఎల్ మ్యాచ్లకు దూరమయ్యాడు. రోహిత్ గాయంతో ఉన్నందునే సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ అతడిని ఎంపిక చేయకుండా విశ్రాంతి ఇచ్చింది.
అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ల కోసం రోహిత్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ముంబై ప్రాక్టీస్ సెషన్స్లో అతను శ్రమిస్తున్న ఫొటోలు, వీడియోలు చూసిన గంగూలీ స్పందించాడు. ఈ ఒక్క లీగ్ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించాడు. రోహిత్లాంటి పరిణతి చెందిన ఆటగాడికి ఇవన్నీ ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు.
‘రోహిత్ గాయపడటం వల్లే ఆసీస్ పర్యటనకు పక్కన బెట్టాం. లేదంటే రోహిత్లాంటి ఆటగాడిని ఎంపిక చేయకుండా ఉంటామా? పైగా అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్కు భారత వైస్ కెప్టెన్. ముందుగా అతని గాయంపై అంచనా వేస్తాం. ఆ తర్వాతే కోలుకునేది ఎప్పుడనేది చెప్పగలం. మాక్కావాల్సింది అతను కోలుకోవడమే. రోహిత్లాంటి స్టార్ క్రికెటర్ను కాపాడుకోవడం, తిరిగి ఆడేలా చూసుకోవడమనేది పూర్తిగా బీసీసీఐ బాధ్యత. అతను కోలుకుంటే ఆడతాడు. ఇందులో సందేహాలు అక్కర్లేదు’ అని గంగూలీ అన్నాడు