తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌


తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పదోతరగతి పరీక్షలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు జూన్‌ 8 నుండి పదో తరగతి పరీక్షలను నిర్వహించుకోవచ్చునని అనుమతి ఇచ్చింది. విచారణ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద అన్నిజాగ్రత్త చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ బీ.ఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. జూన్ నెల ౩వ తేదీన కోవిడ్ పరిస్థితులను సమీక్షించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా జూన్ 4న కోవిడ్ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది.


ఇక జూన్ 8న పరీక్షలు నిర్వహించుకోవచ్చునని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టు పేర్కొంది. పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలియజేసింది.