ప్రణబ్ ముఖర్జీ మరణంపై స్పందించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇక లేరనే విషయాన్ని మాజీ ఎంపీ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతంగా నడపడం, రాజీలేని పోరాటం చేయడం గొప్ప విషయమని ప్రణబ్ ముఖర్జీ చాలాసార్లు సీఎం కేసీఆర్‌ను మెచ్చుకున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉద్యమ పార్టీని స్థాపించడం, తెలంగాణ ఉద్యమాన్ని నడపడం, సాధించిన రాష్ట్రానికి నాయకత్వం వహించడం వంటి చారిత్రక గౌరవం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారని బోయినపల్లి వినోద్ కుమార్ గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా సేవలో ఉన్నా ఎన్నో విజయాలు అందుకున్నా ఏ మాత్రం గర్వం లేని నాయకుడు ప్రణబ్ ముఖర్జి.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణించడంతో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలకు అతీతంగా అందరితో బాగా మెలిగే అతను మరణించడంతో పలు రాజకీయ నాయకులూ తమ సంతాపాన్ని తెలిపారు. వివాదాలకు దూరంగా అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ప్రణబ్ ముఖర్జీ. యూపీఏ ప్రభుత్వ హయాంలో కామన్ మినిమం ప్రోగ్రాం లో తెలంగాణ అంశాన్ని చేర్చడంలో ప్రణబ్ పాత్ర మరువలేనిదని ఆయన తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిస్థితులను ఆకళింపు చేసుకున్న వ్యక్తి ప్రణబ్ అని ఆయన కొనియాడారు. ప్రణబ్ ముఖర్జీ ఒక స్టేట్స్ మెన్, గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు అని వినోద్‌కుమార్‌ కొనియాడారు. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే.