ప్రపంచ వ్యాప్తంగా
కోట్లాదిమంది ప్రజలు క్రిస్మస్ పండుగను
జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ
క్రమంలో లాక్డౌన్ నిబంధనలు సడలించి, కనీసం మూడు కుటుంబాలు కలవడానికి అనుమతించాలని బ్రిటన్
ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.
ఈ మేరకు ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లండ్
మధ్య జరిగిన కోబ్రా ఎమర్జెన్సీ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది. దీనికి నాలుగు
దేశాలూ ఆమోదం తెలిపాయి. లాక్డౌన్తో బిక్కచచ్చిపోయిన ప్రజలకు పండుగ నాడైనా ఊరట
కలిగించాలనే ఉద్దేశ్యంతోనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ ప్రతిపాదన చేశారట.
కానీ ఈ నిర్ణయం ఆహ్వానించ దగినది కాదని సైంటిస్టులు చెబుతున్నారు.
ప్రధాని నిర్ణయంతో కరోనా
కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని, అలాగే ఎక్కువ మంది ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని
హెచ్చరిస్తున్నారు. ప్రజలు కొంత సహనం పాటించి, మరికొన్ని రోజులు వేచి ఉండాలని, ఇతరులను
కలవక పోవడమే ఈ సమయంలో మంచిదని అంటున్నారు. మరి సైంటిస్టుల సూచనకు బ్రిటన్ ప్రధాని
ఎలా స్పందిస్తారో చూడాలి.