కవల పిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలే పుట్టడంతో వారిని చంపడానికి ఒడిగట్టాడు ఒక కసాయి తండ్రి ... తాజాగా ఈ ఘటనే మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో తట్టుకోలేక ఆ శిశువులకు విషమిచ్చాడో తండ్రి. ఈ విషాద సంఘటన గండేడ్ మండలంలో చోటుచేసుకున్నది.
మండలంలోని దేశాయిపల్లికి చెందిన కృష్ణవేణి, కేశవులు దంపతులకు ఈ నెల 1న రాత్రి కవల ఆడపిల్లలు జన్మించారు. అప్పటికే వారికి ఒక కూతురు ఉంది. రెండో కాన్పులోనూ కవల ఆడశిశువులే పుట్టారని కేశవులు ఆవేదన చెందాడు. కోపంతో ఆ శిశువులను చంపేందుకు యత్నించాడు.
భార్యకు తెలియకుండా శిశువులకు పురుగుల మందు తాగించాడు.పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఆ శిశువులను పిల్లల ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. పరిశీలించిన వైద్యులు వారిద్దరికి పాయిజన్ అయినట్లు గుర్తించారు. దాంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా.. కేశవులు పురుగుల మందు డబ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. కేశవులును అదుపులోకి తీసుకున్నారు.