రైతులు ఆందోళన ఉధృతం
చేయడంతో వారిని రాజధానిలోకి ప్రవేశించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ శివార్లలో రైతులు తమ
ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వారికి దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు ఎట్టకేలకు
ఢిల్లీ పోలీసులు అంగీకరించారు. కానీ పోలీసుల పహారాలోనే వారంతా నగరంలోకి రావాలని
షరతు విధించారు. ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని నిరంకారీ మైదానంలో వారంతా
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు కొన్ని రోజులుగా
ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి దారితీసే
మార్గాలన్నీ రైతుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, రైతులకు
మధ్య తీవ్ర ఘర్షణ వాతావారణం నెలకొంది. ఢిల్లీలోకి ప్రవేశించడానికి రైతులు
ప్రయత్నించడంతో వారిని నిలువరించడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్
క్యానన్లతో వారిని అడ్డుకున్నారు. అయినా వారు వెన్నుచూపలేదు సరికదా పోరాటం మరింత
ఉధృతం చేశారు.
రైతులకు వ్యతిరేకంగా
పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లకు అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేసి రైతులను
అడ్డుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన రైతులు బారీకేడ్లను తొలగించి ముందుకు
దూసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ ట్రాక్టర్లతో వాటిని పక్కకు
లాగేస్తున్నారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు.
దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కేంద్రం తక్షణమే రైతులతో మాట్లాడాలని, లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని పంజాబ్
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తమను
రామ్లీలా మైదానంలోకి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ అటు రైతు సంఘాలు ప్రధాని
మోదీకి బహిరంగ లేఖ రాశాయి. ఈ నేపథ్యంలో రైతులను ఢిల్లీలోకి అనుమతించినట్లు
తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలపడానికి రైతులకు అనుమతి ఇచ్చినట్లు ఢిల్లీ సీపీ
తెలిపారు. వీరందరూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.