బుధవారం గవర్నర్‌తో భేటీ కానున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్


బుధవారం గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో ఎన్నికల విషయమై చర్చించేందుకు గవర్నర్‌తో భేటీ కాబోతున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు.

ఏపీ లో ఫిబ్రవరిలో నిర్వహించబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై గవర్నర్‌కు ఎస్ఈసీ వివరిస్తారని సమాచారం. దీపావళి పండుగ ముందు రోజు గవర్నర్‌తో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని గవర్నర్‌కు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశానంతరం విషయాలు తెలియవస్తుంది.