Breaking: చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు... హడలిపోయిన ప్రజలు...!

చిత్తూరు జిల్లా సోమల మండలంలో భూప్రకంపనలు ఒక్కసారిగా కలకలం రేపాయి. జిల్లాలోని ఏటివన్‌, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధిలో మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది.

నిలుచున్న వ్యక్తులు కింద పడిపోయినట్లు అనిపించడం.. శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల ఇళ్లలో పాత్రలు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

ప్రస్తుతం ఆయా గ్రామాల్లో పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, గతంలోనూ స్థానిక గ్రామాల్లోనిపలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.