యాదాద్రి శ్రీ లక్ష్మీ
నరసింహస్వామి ఆలయంలో దర్శనాలకు ఈ నెల 8 నుంచి భక్తులను అనుమతించనున్నారు. అదే సమయంలో ఆర్జిత
పూజల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు
తలెత్తకుండా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. కానీ
యాదాద్రి ఆలయానికి చేరుకొనేందుకు కొన్ని ఆంక్షలు విధించారు. కొండ కింది నుంచి
భక్తులు కాలినడకనే ఆలయానికి చేరుకోవాలని నిబంధన విధించారు. కొండపైకి ఏ వాహనాలకు
అనుమతివ్వబోరని అధికారులు స్పష్టం చేశారు.
యాదాద్రిలో వివిధ శాఖల
అధికారులతో సమావేశమైన ఆలయ ఈవో గీత ఏర్పాట్లపై బుధవారం సమీక్ష జరిపారు. అనంతరం ఆమె
మీడియాతో మాట్లాడారు. కొండ కింది నుంచి పైన ఉన్న ఆలయానికి కాలినడకన వెళ్లే భక్తులు
భౌతిక దూరం పాటించేలా నేలపై బాక్సులను ఏర్పాటు చేశామని, భక్తులు
విధిగా ఆ పెట్టెల గుర్తు ఉన్న చోట మాత్రమే నిలబడాలని చెప్పారు.
తొలుత వారంపాటు దర్శనాల
ప్రక్రియను పరిశీలించి అవసరమైతే తర్వాత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని
చెప్పారు. కరోనాకు ముందు యాదాద్రి కొండపై సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం ఒక్కో
బ్యాచ్కు ఒక హాల్లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారు. కానీ, ప్రస్తుత
పరిస్థితి నేపథ్యంలో ఒక్కో బ్యాచ్కు 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు
చేస్తున్నామని ఈవో వివరించారు. దర్శనాలకు పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల
పైబడిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో స్పష్టం చేశారు.