ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్ రాష్ర్టం నుంచి ఇప్పుడు కరోనాపై విజయం సాధిస్తోన్న స్థాయికి ఢిల్లీ చేరిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం బురారీ 450 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ మాట్లాడుతూ..ఢిల్లీ ప్రభుత్వ ఆసుత్రుల్లో మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తీసిపోకుండా పెంచామని రానున్న కాలంలో మరిన్ని ఆసుప్రతులు నిర్మించనున్నట్లు తెలిపారు. గత నెలతో పోలిస్తే రాష్ట్రములో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని, మరణాల రేటు కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపారు.
జూన్ 23న 3947 కొత్త కరోనా కేసులతో ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవగా ప్రస్తుతం వెయ్యికి తక్కువగానే కేసులు నమోదవుతున్నాయన్నారు. పరీక్షల సామర్థ్యం పెంచడం, సాధ్యమైనంత త్వరగా ట్రేసింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా కరోనా కేసులు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారు.
ప్రతీ ఒక్కరి కృషి , సామాజిక స్పృహతో ఇది సాధ్యమైందని.. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక 24 గంటల్లో 1025 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 32 మంది మరణించారు. ఇప్పటివరకు రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,28,389కు చేరుకోగా, 3777 మంది మరణించారు.