చేసిన పనికి జీతం అడిగిన ఉద్యోగిని సజీవ దహనం చేశాడు ఓ మద్యం షాపు ఓనర్. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ నగరంలోని ఖైర్థల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కమలేశ్ అనే వ్యక్తి… ఉపాధి కోసం ఓ మద్యం షాపులో సేల్స్మ్యాన్ పనిలో చేరాడు.
తాను చేసిన కష్టానికి ఓనర్ జీతం చెల్లించకపోయిన..ఇస్తాడులే అన్న నమ్మకంతో ఐదు నెలలు పని చేశాడు. అయినా ఓనర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో విసిగివేసారిపోయిన కమలేశ్ తన జీతం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
జీతం ఇవ్వలేదు సరికదా… కమలేశ్పై పెట్రోలు పోసి నిప్పంటించాడు యజమాని. ఇందుకు కమలేశ్ సహచరులు కూడా సహకరించారు. తనను తాను రక్షించుకోవడానికి డీప్ ఫ్రిజ్లోకి వెళ్లాడు బాధితుడు.
అప్పటికే పూర్తిగా కాలిపోయిన కమలేశ్… అందులోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి దళితుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది.
అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లిందని ఆరోపించాయి.