క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మరణం...చివరి చూపుకి నోచుకోలేని స్థితిలో..


ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లనీ మెయిడిన్‌గా వేసిన సిరాజ్ రెండు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ బౌలర్ వరుసగా రెండు ఓవర్లని మెయిడిన్‌గా వేయడం అదే తొలిసారికాగా ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దెబ్బకి భారత సెలెక్టర్ల నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ కోసం పిలుపు వచ్చింది. దేశం తరఫున సిరాజ్ మ్యాచ్‌లు ఆడాలనేది అతని తండ్రి మహ్మద్ ఘౌస్ కల. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహ్మద్ ఘౌస్ (53) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మహ్మద్ సిరాజ్ టీమ్ బయో- సెక్యూర్ బబుల్ నిబంధనల కారణంగా హైదరాబాద్‌కి వచ్చే అవకాశం లేకపోయింది. దాంతో తండ్రి కలని నెరవేర్చిన సిరాజ్ చివరి చూపునకి నోచుకోలేకపోతున్నాడు.

సిరాజ్ ఐపీఎల్ మ్యాచ్ల్లో పాల్గొనడంవల్ల వాస్తవానికి తన తండ్రిని చివరిగా ఈ ఏడాది ఆగస్టులో చూశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం యూఏఈకి బయల్దేరే ముందు తండ్రితో కొద్దిరోజులు గడిపిన సిరాజ్ ఐపీఎల్ టైమ్‌లోనూ తరచూ ఫోన్ మాత్రం చేసి మాట్లాడేవాడని తెలుస్తోంది. కోల్‌కతాతో మ్యాచ్‌కి కొన్ని గంటల ముందు మహ్మద్ ఘౌస్ ఊపిరితిత్తుల సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. దాంతో విషయం తెలుసుకున్న సిరాజ్ మ్యాచ్‌కి ముందు తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. కానీ ఆ సమయంలో కొడుకు గొంతు విన్న ఘౌస్ ఎమోషనల్ అయిపోవడంతో సిరాజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో తాను అలానే మాట్లాడుతుంటే తండ్రి బాధపడుతుంటాడని గ్రహించిన సిరాజ్ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు మ్యాచ్‌ తర్వాత సిరాజ్ చెప్పాడు. అయితే మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు ఫోన్ చేయగా అప్పటికే తండ్రి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో సిరాజ్ ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.

సిరాజ్ కోల్‌కతా మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన వల్ల పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలతో ఆయన సంబరపడిపోయారట. దాంతో ఆరోగ్యం కూడా కుదుటపడటంతో ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చినట్లు సిరాజ్‌తో కుటుంబ సభ్యులు చెప్పారట. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైన మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి ఎంపికయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో అతని తండ్రి జీవించి ఉంటే ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో భాగమైన కొడుకుని చూసి ఎక్కువగా సంతోషించి ఉండేవారు. ఇప్పుడు కూడా సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటన నుంచి హైదరాబాద్‌కి రావొచ్చు. కానీ ఒక్కసారి బయో- సెక్యూర్ బబుల్‌ని ఆటగాడు దాటి వెలుపలికి వచ్చిన తర్వాత మళ్లీ అందులోకి వెళ్లాలంటే 14 రోజులు క్వారంటైన్, మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు తప్పనిసరి. దాంతో తండ్రి కలని నెరవేర్చే క్రమంలో ఉన్న మహ్మద్ సిరాజ్ చివరి చూపునకి నోచుకోలేకపోయాడు. నాన్న చనిపోయాడనే వార్త నన్ను షాక్‌కి గురిచేసింది. లైఫ్‌లో అతి పెద్ద సపోర్ట్‌ని కోల్పోయా. దేశం తరఫున నేను ఆడాలనేది మా నాన్న కల. నేను టీమిండియాలోకి ఎంపికవడం నాన్నకి సంతోషం కలిగించి ఉంటుంది అని తన ఆవేదనని వెళ్లగక్కాడు.