కరోనా భయంతో బెడ్ పైనే గొంతు కోసుకొని చనిపోయిన కరోనా రోగి


కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌ బారీన పడి చాలా మంది మృతి చెందారు. అయితే..కరోనా సోకుతుందనే భయంతోనే కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే...మరికొందరు కరోనా సోకకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

సరిగ్గా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో సంగ్లి జిల్లాలో జరిగింది. కరోనా సోకిన 56 సంవత్సరాల వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడు ఆస్పత్రి బెడ్‌పై కూర్చుని గొంతు కోసుకున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటన జరిగిన వెంటనే వైద్యులు అతన్ని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి బతికించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. బాధితుడు ఈ దారుణానికి పాల్పడటానికి ముందు తన కుమారుడికి ఫోన్ చేసి కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సమాచారం అందుకున్న మహాత్మాగాంధీ చౌక్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. కరోనా కారణంగానే అతడు ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు చెప్పారు. మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.