కరోనా మహమ్మారి దెబ్బకు ఒకవైపు దేశం మొత్తం వణుకుతుంటే మరోవైపు దాని నిర్మునలకు వాక్సిన్ తయారు చేసే పనిలో అన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి ..తాజాగా భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవాక్సిన్ కీలక ట్రయల్స్ దశకు చేరింది ..దేశంలో పన్నెండు ఆసుపత్రిలలో ఈ ట్రయల్స్ నిర్వహిస్తాము అని ఐసిఏంఆర్ తెలిపింది..ఈ నేపథ్యంలో నిమ్స్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 7వ తేదీ నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫేస్ 1, ఫేస్ 2 కింద ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు. క్లినికల్ ట్రయల్స్కు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. మొదటి ఫేస్ 28 రోజులు ఉంటుందని, వ్యాక్సిన్ ఇచ్చాక రెండు రోజులు ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామని మనోహర్ పేర్కొన్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది.