ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ
పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, ప్రతిపక్షాల
దూకుడుగా వెళ్తున్న తరుణంలో సీఎం జగన్ ఆకస్మిక పర్యటన ఆసక్తికరంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిషా సహా పలువురు బీజేపీ
అగ్రనేతలతో సీఎం జగన్ భేటీ కాబోతున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 3
గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు సాయంత్రం 5 గంటల
సమయంలో సీఎం ఢిల్లీ చేరుకుని రాత్రికి కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే
అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయా మంత్రుల అపాయింట్మెంట్ను కోరినట్లు సమాచారం.
ముఖ్యంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, హర్షవర్ధన్తో సీఎం జగన్
భేటీ కానున్నారు. ప్రధాని మోదీతో కూడా
సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి
రావాల్సిన నిధులు, జీఎస్టీ, కరోనా తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కేంద్ర మంత్రులకు వివరించే అవకాశముంది. పోలవరం, ఉపాధి హామీ నిధులు పెండింగ్ నిధుల విడుదలపై వారితో
చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు సీఎం చర్చించే
అవకాశమున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానులపై కేంద్ర హోం శాఖ అఫిడవిట్లు దాఖలు
చేసిన నేపథ్యంలో వాటిపైనా చర్చించే వీలుంది. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై
దాడులు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు
గుప్పిస్తున్నాయి.