ఆఖరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి


బుధవారం ఆఖరి నిమిషంలో తన పర్యటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటనను ఆఖరు నిమిషంలో రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి జరిగే రెండు వివాహాలకు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది. ఇందుకు గాను బుధవారం సాయంత్రం బయల్దేరి మళ్ళీ రాత్రి 9.30కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకునేలా షెడ్యూల్ వేశారు. కానీ, చివరి నిమిషంలో సీఎం జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం సీఎం జగన్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఓ పారిశ్రామికవేత్త కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి ఉంది.

మొదటగా హాజరైన వివాహం తర్వాత అయన ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత సీఎం జగన్ తన సొంత దినపత్రిక సంపాదకుడి ఇంట జరిగే మరో వివాహానికి హాజరైన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ-గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్ళేలా ప్లాన్ చేశారు. అయితే, బంగాళాఖాతం మీదుగా దూసుకు వస్తున్న నివర్ తుఫాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం వుండడంతో జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు చేసుకున్నట్లు సీఎంఓ తెలియజేసింది.