కరోనా వైరస్ పరీక్షల
నిర్ధారణలో ఏపీ ప్రభుత్వం ఆదివారం మరో ఘనత సాధించింది. దేశంలో 10 లక్షలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించిన మూడో
రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అయితే ఏపీలో కరోనా పరీక్షలుపై తెలుగు దేశం పార్టీ
అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అనుమానం
వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ వీడియోను షేర్ చేసిన చంద్రబాబు వరుస ట్వీట్లు
చేశారు.
కరోనా పరీక్షలు వట్టి మాయ
అయినా అయుండాలి లేకపోతే కుంభకోణమైనా జరిగుండాలని అంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
చేశారు. ఏపీలో 10
లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశామని వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడంపై టీడీపీ అధినేత
చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే
ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా
తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ‘‘అనంతపురం నుంచి ఓ వీడియో వచ్చింది. కరోనా
పరీక్షల కోసం శాంపిల్ ఇవ్వని వ్యక్తులకు కూడా కరోనా టెస్టుల్లో మీ ఫలితం ఇదీ అంటూ
ఫోన్లకు సందేశాలు వస్తున్నట్లు ఆ వీడియోలో చెబుతున్నారు.
ఓ ప్రభుత్వం తన
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇంత నీచానికి దిగజారుతుందన్న విషయం దిగ్భ్రాంతి
కలిగించింది. ఏపీ సర్కారు చెబుతున్న ఒక మిలియన్ కోవిడ్ 10 టెస్టుల గణాంకాలు వట్టి మాయ లేకపోతే కుంభకోణం అయినా
అయుండాలి. నేను కేంద్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను.. వెంటనే ఈ విషయాన్ని
పరిశీలించండి. టెస్టులు చేశామంటూ ఫోన్లకు సందేశాలు పంపే ప్రభుత్వ ప్రోద్బలం ఉన్న
రాకెట్ వెనుక మోసపూరిత ఉద్దేశాలను బయటపెట్టండి’’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.