మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్
నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై
ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఢిల్లీలో ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్
రిఫరల్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన మెదడులో రక్తం
గడ్డకట్టడంతో శస్త్రచికిత్స చేశారని వార్తాఏజెన్సీలు ప్రకటించాయి.
మరోవైపు తనకు కరోనా
సోకిందని ప్రణబ్ ముఖర్జీ సోమవారం ట్వీట్ చేశారు. వేరే చికిత్స కోసం ఆసుపత్రికి
వెళ్లినప్పుడు అక్కడ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలిందని గత వారం రోజుల్లో
తనను కలిసినవారెవరైనా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని రక్షణ మంత్రి
రాజ్నాథ్ సింగ్ వాకబు చేశారు. సోమవారం ఆయన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి
వెళ్లి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు.
ప్రణబ్ త్వరగా
కోలుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్
సూర్జేవాలా, అభిషేక్ సింఘ్వి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, పశ్చిమ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ప్రణబ్ కోలుకోవాలంటూ ట్వీట్లు చేశారు.
కాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు
భారత రాష్ట్రపతిగా ఉన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ
ప్రభుత్వాలలో ఆర్థిక మంత్రిగా.. మన్మోహన్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పీవీ
నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో విదేశీ వ్యవహారాల
మంత్రిగానూ పనిచేశారు.