సికింద్రాబాద్లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్లో ఆటలు ఆడకూడదని తల్లి మందలించినందుకు ఒక మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో నివాసం ఉంటున్న ఒక 14 ఏళ్ల మైనర్ బాలుడు ప్రతిరోజు మొబైల్లో పబ్జీ ఆడుతూ ఉంటాడు. అయితే శనివారం కూడా పబ్జీ ఆడటానికి ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో ఆటలు ఆడకూడదని తల్లి మందలించి ఫోన్ లాక్కోవడంతో బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో ఆ 14 సంవత్సరాల బాలుడు తన గదిలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకొని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తలుపు తీయమని తల్లి ఎంతగా కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి డోర్ బలవంతంగా తెరిచారు. లోపలికి వెళ్లి చూడగా బాలుడు ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు. దీంతో తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.