బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ కెరటంగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ తానే అసలు సిసలైన విజేతనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నప్పటికీ ప్రజల హృదయాలను తామే గెలిచామన్నారు.
గురువారం మహాకూటమి శాసనసభా నేతగా ఎన్నికైన తేజస్వి ప్రధాని మోదీ, బిహార్ సీఎం నితీశ్లపై నిప్పులు చెరిగారు. వారు దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. 20 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, చాలా ఓట్లని చెల్లని ఓట్లు అంటూ పక్కన పెట్టారని విమర్శించారు. ఆ స్థానాల్లో రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘నితీశ్ ఛరిష్మా ఏమైపోయింది ? ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారిపోయింది. మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు.
నితీశ్ సీఎం పీఠంపై కూర్చోవచ్చు కానీ మనం ప్రజల హృదయాల్లో నిలిచాం’ అని తేజస్వి అన్నారు. ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య ఓట్ల తేడా కేవలం 12,270 మాత్రమేనని అలాంటప్పుడు వారికి 15 సీట్లు అధికంగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు.