బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి విడత 71 స్ధానాలకు పోలింగ్ బుధవారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 52.24 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. పోలింగ్ జరిగిన 71 స్ధానాల్లో ఆర్జేడీ 42 మంది అభ్యర్ధులను బరిలో దింపగా, జేడీయూ తరపున 35, బీజేపీ 29, కాంగ్రెస్ 21, సీపీఐ-ఎంఎల్ 8, హెచ్ఏఎం ఆరుగురు అభ్యర్ధులను బరిలో నిలిపాయి.
ఇక ఇతర పార్టీల తరపున ఆర్ఎల్ఎస్పీ నుంచి 43, ఎల్జేపీ 41, బీఎస్పీ నుంచి 27 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. సోమవారంతో ముగిసిన తొలి విడత పోలింగ్ ప్రచారంలో పలు పార్టీల తరపున అగ్రనేతలు, సీనియర్ నేతలు ప్రచార పర్వాన్ని వేడెక్కించారు.
ఇక జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాలుగోసారి అధికార పీఠంపై కన్నేశారు. బీజేపీతో కలిసి ముందుకు సాగుతుండగా ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి మహాకూటమిగా జట్టుకట్టాయి. నితీష్ సర్కార్పై నెలకొన్న అసంతృప్తి తమకు అనుకూలిస్తుందని మహాకూటమి ఆశలు పెట్టుకుంది.