బీజేపీకి అవకాశమిస్తే పాతబస్తీని హైటెక్ సిటీగా మారుస్తాము....బండి సంజయ్


హైదరాబాద్ పరిధిలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. సోమవారం ఆయన మియాపూర్ నుంచి నాంపల్లి వరకు తొలిసారి మెట్రో రైల్లో ప్రయాణించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. భాగ్యనగరాన్ని పాతబస్తీలా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని చెప్పారు. బీజేపీకి అవకాశమిస్తే పాతబస్తీని హైటెక్‌సిటీగా మారుస్తామని వెల్లడించారు. బుధవారం నుంచి నగరంలోని అన్ని డివిజన్లలో ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు..

ఓటర్ల జాబితాను సరిచేశాకే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రణాళిక ప్రకారమే హిందువుల ఓట్లను ప్రభుత్వం తగ్గించిందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ చట్టానికి అతీతం కాదన్నారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికుందా? అని సంజయ్‌ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ 75స్థానాలు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.