ఏపీ గవర్నర్ తో భేటీ కానున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్


స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌‌ఈసీ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై గవర్నర్‌కు ఈసీ వివరిస్తారని తెలుస్తోంది.

దీపావళి పండుగ ముందు రోజు గవర్నర్‌తో భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అప్పట్లో గవర్నర్‌కు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.