ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఒకప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953లో ఆంధ్ర రాష్ట్రంగా, మూడేళ్ల తర్వాత 1956 నవంబర్ 1న హైదరాబాద్తో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
అప్పటి నుంచి అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 2014లో రాష్ట్ర విభజన జూన్ 2న జరిగింది. దీంతో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అదేరోజు అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇటు ఏపీలో మాత్రం దీనిపై తర్జనభర్జనలు జరిగాయి. నవంబర్ 1నే కొనసాగించాలా? లేదా జూన్ 2ను అధికారికంగా ప్రకటించాలా అన్న సందిగ్ధంలో పడింది.
టీడీపీ ప్రభుత్వం విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందన్న కారణంతో జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపట్టడం ప్రారంభించింది. అది 8వ తేదీన మహాసంకల్ప దీక్షతో ముగిసేది. అయితే, తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ వేడుకలు జరపనున్నారు.రాజ్ భవన్లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. అలాగే క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇటు జిల్లాల్లో మంత్రులు జెండాలు ఆవిష్కరించనున్నారు.