ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష


ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఇప్పటికే జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసింది.

పునర్ వ్యవస్థీకరణ లో తలెత్తుతున్న సమస్యలు, డిమాండ్లను సీఎంకు వివరిస్తోంది కమిటీ. సమకూర్చాల్సిన నిధులు, అధికారిక పోస్టులపై కూడా సీఎంకు వివరిస్తున్నారు. కమిటీ సిఫార్సులను పరిశీలించనున్నారు సీఎం జగన్. భౌగోళిక, ఆర్ధిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో కసరత్తులు చేస్తున్నారు.

ఆదాయ వనరులతో కూడిన కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అందుబాటులో ఉన్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు వేస్తోంది. అవసరమైన చోట అందుబాటులో ఉన్న ఉద్యోగులనే అప్ గ్రేడ్ చేసి బాధ్యతలు అప్పగించేలా ఏర్పాట్లు జరుపుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలంటే కొన్ని మండలాలను పునర్ వ్యవస్థీకరించాల్సి వస్తోందనే భావనతో వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. 26 జిల్లాలకే పరిమితం కావడం కష్టంతో కూడుకున్న వ్యవహరంగా ఉందంటున్నారు అధికారులు.