జలశక్తి శాఖ మంత్రితో సీఎం జగన్ భేటీ....!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో ఇవాళ బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. కేంద్రమంత్రితో భేటీ సందర్భంగా .. పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు విడుదల చేయాలని షెకావత్ ని కోరారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది.


మంగళవారం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకున్న జగన్.. అమిత్ షా ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు పోలవరం కరోనా వైరస్ సహా పలు కీలక అంశాలను అమిత్ షాకు సీఎం వివరించినట్టు సమాచారం. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

మరోవైపు రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా నేతలిద్దరూ చర్చిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు దిశ చట్టం శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.