రాజస్థాన్లో ఓ దొంగ బాబా ఆగడాలు వెలుగుచూశాయి. బాబా ముసుగులో అతడు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వికృత చేష్టలతో విసిగిస్తున్నాడని నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాబా గుట్టు రట్టయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం బుండి ప్రాంతంలో కొన్నేండ్ల క్రితం ఓ వ్యక్తి బాబా అవతారం ఎత్తి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను దేవుడినని, తనలో దైవత్వం ఉన్నదని స్థానిక ప్రజలను నమ్మించాడు. దీంతో వారిలో చాలామంది అతనికి భక్తులుగా మారిపోయారు.
ఎలాంటి సమస్యలైనా తనకు చెప్పుకుంటే పరిష్కారం చూపిస్తానని అతడు ప్రచారం చేసుకోవడంతో.. ఎంతో మంది సమస్యలతో అతనికి దగ్గరికి వస్తున్నారు. అయితే, ఇలా వచ్చేవారిలో కొందరిని అతడు లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలున్నాయి.
అయితే, పరువు పోతుందన్న భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం నలుగురు మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగ బాబా బండారం బయటపడింది. కాగా, మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు దొంగ బాబాపై కేసు నమోదు చేశారు.