జీహెచ్ఎంసీ ఎన్నికల
ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు
కనబరుస్తున్నారు. మరోసారి ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై తీవ్ర
స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోల
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై
కేసులు పెట్టారని చెప్పారు. కేసులకు, రిమాండ్లకు భయపడే సమస్యే లేదన్నారు. పీవీ
నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేస్తామని ఎంఐఎం నేత
అక్బరుద్దీన్ మాట్లాడితే సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని
ప్రశ్నించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ వెంటనే స్పందిస్తే తాను
మాట్లాడేవాడిని కాదని అన్నారు. హిందువులను కించపరచాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు.
ఎన్నికలప్పుడే టీఆర్ఎస్
నేతలకు ప్రజలు గుర్తుకువస్తారని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్పై సమీక్షకు
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారని తనను పిలవలేదని సీఎం కేసీఆర్
అంటున్నారని మరి ఇన్ని రోజులు ఆయన ఎం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు
వ్యాక్సిన్ అవసరం లేదని.. ఆయన ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మకయ్యారని ఆరోపించారు.
వరదల సమయంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్లోనే బాధితులను పరామర్శించలేదని విమర్శించారు.
అప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ల్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఓట్ల కోసం ఇదే
హైదరాబాద్లో సభ పెడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ది కోసం బీజేపీకి ఓటువేసి
గెలిపించాలని కోరారు. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్, బీజేపీల
మధ్య మాటాల తుటాలు పేలుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో
అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే నగరంలో నేడు
సీఎం కేసీఆర్ సభ జరగనుంది. మరోవైపు బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా రేపు
హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక, డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ
తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.