మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి... ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

పక్షవాతమంటే?

పక్షవాతం.. తెలియకుండానే మనిషిని కుంగదీసే ప్రమాదకర వ్యాధి. అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తిని అకస్మాత్తుగా.. వికలాంగుడిగా మార్చేస్తుంది. చివరికి.. ప్రాణాలు కూడా తీస్తుంది. మనిషిలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. శరీరం మొత్తాన్ని నడిపేది ఈ అవయవమే.

మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అదుపుతప్పకుండా పనిచేస్తుంది. అలాంటి మెదడులో చిన్న సమస్య తలెత్తినా ‘బ్రెయిన్ స్ట్రోక్’ ఏర్పడుతుంది. అదే ‘పక్షవాతం’. దీని వల్ల శరీరంలోని అవయవాలు అదుపు తప్పుతాయి. ముఖ్యంగా కాలు, చేతులు పనిచేయకుండా పోతాయి. అసలు ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు తదితర విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి.


బ్రెయిన్ స్ట్రోక్‌ రెండు రకాలు:
1. పక్షవాతంలో రెండు రాకాలున్నాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్.

2. మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడిపోతాయి. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు.

3. మెదడులోని రక్తనాళాలు చిట్లినప్పుడు అంతర్లీనంగా రక్తస్రావం జరుగుతుంది. దీన్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త:

1. మాటలు ముద్దగా రావడం.2. ఒక కాలు, ఒక చేయి బలహీనంగా మారడం.3. మతి మరపు.4. సరిగా నడవలేకపోవడం.

పక్షవాతం ఎందుకు వస్తుంది?:

1. పక్షవాతానికి అనేక కారణాలు. కొందరికి వయస్సు పెరగడం, వారసత్వం వల్ల పక్షవాతం వస్తుంది.
2. పక్షవాతం ఎక్కువగా పురుషుల్లోనే ఎక్కువగా వస్తుంది. దురలవాట్లు, దీర్ఘకాలిక వ్యాధులే ఇందుకు కారణం.
3. దూమపానం, మద్యపానం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది.
4. ఇక డయాబెటీస్ (మధుమేహం), రక్తపోటు, స్థూలకాయం సమస్యలుంటే.. పక్షవాతం పొంచివున్నట్లే.
5. చాలామందిలో 50 ఏళ్ల వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వయస్సు మీదపడిన తర్వాత ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

ఈ జాగ్రత్తలు పాటించండి:
1. రక్తపోటును నియంత్రించుకోవాలి..

2. రక్తపోటుకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మందులు వాడి అదుపులో ఉంచుకోవాలి.

3. డయాబెటీస్‌ను నియంత్రించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో లేకపోతే పక్షవాతం కొనితెచ్చుకున్నట్లే.

4. బరువు పెరగకుండా వ్యాయమం, యోగా చేయండి. సమతుల ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.

5. రోజుకు 30 నిమిషాల చొప్పున ప్రతి రోజూ వ్యాయామం చేయాలి.

6. ఒక్కసారి పక్షవాతం వస్తే.. ఇక జీవితాంతం నరకమే. అందుకే ముందు జాగ్రత్తలతోనే పక్షవాతాన్ని అడ్డుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

7. బీపీ 130/80 లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

8. ఆహారంలో ఉప్పు తగ్గించండి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.


వేడి నీటి స్నానంతో పక్షవాతాన్ని అడ్డుకోవచ్చా?:

జపాన్ పరిశోధనలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. రోజూ గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే గుండె జబ్బుల సమస్య ఉండదని, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉండదని తేలింది. సుమారు 20 ఏళ్లుగా.. 30 వేల మందిపై ఈ అధ్యయనం జరిపారు. వేడి నీటితో స్నానం.. ఏరోబిక్స్‌తో సమానమని పరిశోధకులు తెలిపారు.

చన్నీళ్లతో స్నానం చేసేవారిలోనే ఎక్కువగా పక్షవాతం వస్తుందని పేర్కొన్నారు. వేడి నీటితో స్నానం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు సూమారు 26 శాతానికి తగ్గుతాయని తెలిపారు. అయితే, పక్షవాతాన్ని అడ్డుకోడానికి ఇది మాత్రమే సరిపోదాని, దీర్ఘకాలిక వ్యాధులు.. అలవాట్లపై నిఘా పెట్టాలని లేకపోతే ఎప్పటికైనా ప్రమాదమేనని స్పష్టం చేశారు. చూశారుగా.. పక్షవాతం మనిషిని బతికున్న శవంగా మార్చేస్తుంది. ఆ సమస్య రాకూడదంటే.. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం.