ప్రభాస్ గత
సినిమా ‘సాహో’కు మ్యూజిక్ విషయంలో ఎంత సందిగ్ధత నడిచిందో తెలిసిందే. ముందు ఆ
చిత్రానికి శంకర్-ఎహసాన్-లాయ్లను సంగీత దర్శకులుగా ఎంపిక చేశారు. కానీ వారి ఔట్
పుట్ నచ్చకో ఇంకేదైనా కారణంతోనే చివరి దశలో తప్పుకున్నారు. విడుదలకు కొన్ని నెలల
ముందు ఇది జరిగింది. దీంతో
అప్పటికప్పుడు ఏదో హడావుడిగా వేర్వేరు సంగీత దర్శకులతో పాటలు చేయించుకున్నారు.
టీజర్లకు సాయం పట్టిన జిబ్రాన్తోనే బ్యాగ్రౌండ్ స్కోర్ తీసుకున్నారు. ఈ
చిత్రాన్ని నిర్మించిన యువి క్రియేషన్స్ వాళ్లే ప్రభాస్ కొత్త చిత్రాన్ని కూడా
ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఐతే ‘సాహో’ అనుభవం నేపథ్యంలో దీనికైనా మ్యూజిక్
డైరెక్టర్ విషయంలో జాగ్రత్త పడతారేమో అనుకుంటే అదేమీ జరగలేదు. సినిమా చిత్రీకరణ 80 శాతం దాకా పూర్తయిందంటున్నారు. కానీ
ఇప్పటిదాకా సంగీత బాధ్యతలు ఎవరివన్నదానిపై సమాచారం లేదు.
ఇది ప్రేమకథా
చిత్రం ‘సాహో’తో పోలిస్తే ప్రభాస్ కొత్త సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యం
ఉంది. మంచి ఫీల్ ఉన్న పాటలు, బ్యాగ్రౌండ్
స్కోర్ అవసరం. ఎక్కువ రోజులు మనసు పెట్టి పని చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు ముందే
సంగీత దర్శకుడిని ఖరారు చేసుకోవాల్సింది. కానీ అలాంటిదేమీ జరిగినట్లు లేదు. మధ్యలో
‘సైరా’ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది పేరు వినిపించింది కానీ దానిపై ఏ సమాచారం
లేదు. చిత్ర బృందం ఉద్దేశమేంటో అర్థం కావడం లేదు. ‘సాహో’ మాదిరే నాన్చి చివర్లో
ఎవరో ఒకరితో హడావుడిగా పని చేయించి పాటల్ని చెడగొడతారేమో అన్న ఆందోళన ప్రభాస్
అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు లాక్ డౌన్ పూర్తయ్యాక మంచి ముహూర్తం చూసుకుని
ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్
చేయాలని చూస్తున్నట్లు సమాచారం.