కరోనా కారణంగా దేశంలో అప్పటి వరకు ఉన్న పరిస్థితులు అన్ని తలకిందులు అయ్యాయి ..దేశం మొత్తం సంపూర్ణ లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి ..దీనితో అనేక మంది ఉద్యోగులు హఠాత్తుగా తమ ఉద్యోగాలను కోల్పోయారు ..అయితే దేశంలో లాక్ డౌన్ విడతల వారీగా ఎత్తివేస్తుండటంతో అనేక కంపెనీలు తిరిగి ఉద్యోగులను నియమించుకునే పనిలో పడ్డాయి..
గత రెండు, మూడు వారాలుగా ఈ కామర్స్, డేటా ప్రాసెసింగ్, బ్యాంకింగ్, డిజిటల్ నిపుణులు తదితర రంగాలలో ఉపాధి అవకాశాలు పుంజుకున్నామని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లాక్డౌన్ సమయంలో 80 శాతం కంపెనీలు ఉద్యోగ నియామకాలవైపు ఆసక్తి చూపలేదని, కానీ లాక్డౌన్ సడలింపు తర్వాత 50 శాతం సంస్థలు ఉద్యోగ నియామకాలకై ఆసక్తి కనబరుస్తున్నాయని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ ఆధిత్యా మిశ్రా తెలిపారు.
కానీ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కాగా రాండ్ స్టాండ్ ఇండియా సంస్థ అధికారి సంజయ్ శెట్టి స్పందిస్తూ.. తయారీ రంగం, టెలికాం రంగంలో కొంత మేర వృద్ధి నమోదు కావచ్చని తెలిపారు. అయితే ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో శుభపరిణామని శెట్టి అన్నారు. కాగా నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని టీమ్ లీస్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు రితుపర్నా చక్రవర్తి పేర్కొన్నారు.