- హోమ్›
- టూర్స్ అండ్ ట్రావెల్స్›
- శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు
శ్రీకాళహస్తి ఆలయ విశేషాలు
By: chandrasekar Wed, 03 June 2020 6:47 PM
ఈ దేవాలయం దేశంలోని అతి
పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి
భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం
కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా
జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి
కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి
సాంకేతిక కళాశాలను 1997లో
స్థాపించారు.
* నాలుగు
దిక్కుల దేవుళ్ళు
గుడి గర్భాలయంలోని
శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన
ప్రసూనాంబ విగ్రహాలు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ
వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు
అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి
ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి
దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో
వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి
నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని
చెబుతారు.
* గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా
నాలుగు గోపురాలు 120
అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం
ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు
వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని
సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర
నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని
"బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం
గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ
దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి
కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున
"చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ
గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప
గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.
* ఇతర
శివలింగాలు, పరివార
దేవతలు
ఇక్కడ అనేక శివలింగాలు
మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ
నారీశ్వర లింగము; అగస్త్యుడు
- నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు
- మణి కంఠేశ్వర లింగము; ఇంకా
వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల
కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా
మూర్తి స్వరూపుడై యున్నాడు.
ఇక్కడ క్షేత్ర పాలకుడు
కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య
స్వామి, సూర్య, శని
గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ
స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప
విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64
నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.
* మంటపములు
ఆలయంలో శిల్పకళతో శోభించే
స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా
అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని
శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో
అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం
ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.
* రాహు
కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని
ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ
నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ
నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు
వచ్చింది. సర్ప దోషము, రాహు
కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ
కవచమునకు అలంకారములు చేస్తారు.
* దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ
ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని
దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం
అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక
సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.
* సేవలు
ఆలయంలో జరిగే కొన్ని
సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర
అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి
అర్చన, పాలాభిషేకము, పచ్చ
కర్పూరాభిషేకము, కాశీ
గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత
సేవ, వాహన పూజ, సుప్రభాత
సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష
(రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు
ఊంజల్ సేవ, నంది
సేవ, పెద్ద వెండి సింహ వాహనము.
* తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయి. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ
తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య
చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా
"మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.
* ఇతర
విశేషాలు
ధర్మ కర్తల మండలి
పరిపాలనలో, దేవాదాయ
శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి
వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ
వసతి గృహం, బాలజ్ఞానాంబ
సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి.
పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007
నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల
రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా
భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.