Advertisement

అరకులోయ అందాలు

By: chandrasekar Sat, 13 June 2020 8:53 PM

అరకులోయ అందాలు


విశాఖపట్నం టూరిజంకు వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించే ప్రాంతం 'అరకు లోయ'. మరపురాని అనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం అని టూరిస్టులు పిలుస్తారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన అరకులోయ అందాలను వర్ణించాలంటే అక్షరం పులకిస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయ పద్ధతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశేషాలు.

మరపురాని అనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం 'అరకులోయ' అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కుటుంబంతో కలిసి సంతోషంగా హాలిడేను ఆస్వాదించేందుకు దీనికి మించిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకటి లేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం సందర్శనకు వచ్చే టూరిస్టులెవరైనా అరకులోయను సందర్శించకుండా వెళ్లరు. నగర పర్యటన ముగించుకున్న తరువాత హిల్ స్టేషన్ కు పయనమయ్యేందుకు అధికశాతం టూరిస్టులు ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది. పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు.. లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్ లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది.

arakuloya,natural beauties,caves,hills,water falls ,అరకులోయ, అందాలు, విశాఖపట్నం, టూరిజంకు, పర్యాటకులు


అరకులోయకు రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ఘాట్ రోడ్డు ప్రయాణంలో సుదూరంగా ఉండే జలపాతాలు, గుహలు, ఎత్తైన వంతెనలు కనిపిస్తూ ఊరిస్తుంటాయి. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం సాధ్యపడదు. అదే రైలు మార్గం ద్వారా ప్రయాణిస్తే ఈ అనుభూతులను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు బస్ లు, ఇతర వాహనాలను బుక్ చేసుకుని రావడం వలన ఈ ప్రయాణాన్ని మిస్ అవుతూ ఉంటారు. కొందరు విశాఖలో తమ వాహనం దిగి రైలు ద్వారా అరకు చేరుకుని అక్కడ తిరిగి తమ వాహనాలను అందుకోవడం చేస్తుంటారు.

రైలు ప్రయాణాన్ని మిస్ కాకూడదనుకుంటే ఇది ఒక చక్కని ఐడియా. కిరండూల్ వెళ్లే ప్యాసింజర్ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 7.10 గంటలకు బయలుదేరుతుంది. రైల్వేశాఖ టూరిస్టుల కోసం ఈ రైలుకు అదనంగా అద్దాల బోగీని జత చేసింది. ఇది మిస్ అయితే అరకు వెళ్లే రైలు మరొకటి లభించదు. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుని స్టేషన్ కు చేరుకోవడం మంచిది. అరకులోయ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పక చూడాల్సిన ప్రదేశం బొర్రాగుహలు. ప్రకృతి చిత్రించిన ఈ అద్భుతం సుమారు 10 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ 1807లో బొర్రాగుహలను కనుగొన్నారు. ఇక్కడ సుమారు 50 వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు దొరకడంతో ఇక్కడ ఆదిమానవులు జీవించేవారని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు.

ఏపీ పర్యాటక శాఖ 1990లో ఈ గుహలను తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. గుహల బయట ఉద్యాన మొక్కల పెంపకం, గుహలను వీక్షించే విధంగా లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో బొర్రాగుహలను సందర్శించే పర్యటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతుంది. అరకు నుంచి 36 కిలోమీటర్ల దూరంలో బొర్రా గుహలు ఉన్నాయి. విశాఖ నుంచి రైలులో వచ్చే ప్రయాణీకులు బొర్రా స్టేషన్ లో దిగి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు ముందుగా బొర్రా గుహలను సందర్శించి అరకు వెళ్లవచ్చు.

arakuloya,natural beauties,caves,hills,water falls ,అరకులోయ, అందాలు, విశాఖపట్నం, టూరిజంకు, పర్యాటకులు


కటికి, తాటిగూడ జలపాతాలు:

బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతం ఉంటుంది. ఇక్కడికి స్థానిక జీప్ లలో వెళ్లడం ఒక్కటే మార్గం. రోడ్డు అంతా రాళ్లు తేలి ఉండడంతో ఇతర వాహనాల్లో వెళ్లడం క్లిష్టతరంగా ఉంటుంది. పార్కింగ్ పాయింట్ కు చేరుకున్న తరువాత సుమారు 500 మీటర్లు నడిచి జలపాతం చేరుకోవాల్సి ఉంటుంది. 50 అడుగులకు పైగా ఎత్తు నుంచి జాలువారే కటికి జలపాతాన్ని చూస్తే అలసటలను, ప్రయాణంలో ఇబ్బందులను టూరిస్టులు మరచిపోతారు.

అక్కడ గుడారాలు వేసుకుని వంట చేసుకోవడంతో పాటు పర్వతారోహణ, జలపాతం అడుగున మడుగులో స్నానాలు చేస్తూ పర్యాటకులు సేదతీరుతుంటారు. అనంతగిరికి సమీపంలో ఉండే ఈ జలపాతం అరకు మార్గంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. బొర్రా గుహలు, కటికి జలపాతాలను సందర్శించిన వారు సమీపంలోని తాటిపూడి జలపాతాన్ని కూడా సందర్శిస్తారు.

గిరిజన మ్యూజియం:

అరకులోయ కూడలిలో ఉండే గిరిజన మ్యూజియం ఈ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. బోటు షికారుతో పాటు పచ్చని పరిసరాలు, ఎంతో సహజంగా కనిపించే గిరిజనుల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. రెండంతస్తుల్లో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం సందర్శన గిరిపుత్రుల జీవిన విధానం కళ్లకు కనబడుతుంది. మ్యూజియం ఆవరణలో స్టాల్స్ ద్వారా గిరిజనులు తయారు చేసిన వివిధ వస్తువులు, కాఫీ తదితర సామగ్రిని టూరిస్టులు కొనుగోలు చేయవచ్చు.

arakuloya,natural beauties,caves,hills,water falls ,అరకులోయ, అందాలు, విశాఖపట్నం, టూరిజంకు, పర్యాటకులు


పద్మాపురం గార్డెన్స్:

అరకు రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పద్మాపురం గార్డెన్స్ ఉంటుంది. అనేక రకాల పుష్పాజాతులు, మొక్కలు, ఆకట్టుకునే ల్యాండ్ స్కేపింగ్ దీని ప్రత్యేకతలు. సువిశాలమైన గార్డెన్స్ మొత్తం తిరిగేందుకు చిన్న రైలు సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది. అరకు పర్యటనకు వచ్చే టూరిస్టులు కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడిపేందుకు ఇది ఒక చక్కని ప్రదేశం.

చాపరాయి జలపాతం:

అరకు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంది. నీటి ప్రవాహంతో నునుపు వచ్చిందా అనే విధంగా కనిపించే బండరాళ్లపై జలపాతం ప్రవాహాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ ఫోటోలు దిగేందుకు టూరిస్టులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా ఇక్కడ లభించే బొంగులో చికెన్ ను మాంసాహారప్రియులు లొట్టలేసుకుని తింటుంటారు.

కాఫీ తోటల నడుమ సాగే అరకు ప్రయాణంలో గిరిజనులు తయారుచేసే సహజసిద్ధ ఉత్పత్తులను కూడా టూరిస్టులు కొనుగోలు చేసుకోవచ్చు. కాఫీ పొడి మొదలుకొని అనేక రకాల వస్తువులను గిరిజనులు విక్రయిస్తుంటారు. మంచి రకం తేనె, కాఫీగింజలు ఇక్కడ ప్రత్యేకతలు. రుచికరమైన భోజనంతో పాటు బస చేసేందుకు అన్ని బడ్జెట్ లలో హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మాసం మధ్య ప్రయాణం ఇక్కడ ఆహ్లాదభరితంగా ఉంటుంది.

Tags :
|
|

Advertisement