రాఖీ పౌర్ణమి విశేషాలు
By: chandrasekar Wed, 03 June 2020 11:04 AM
శ్రావణ పూర్ణిమనే రాఖీ
పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్
ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు.
కానీ, పురాణాలలో
మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు
ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ
ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి
కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు.
మహాభారతంలో
ద్రౌపది, శ్రీకృష్ణుల
అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన
చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది.
అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి
మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి తలో దిక్కున వెళ్లి వెదుకుతుంటే
ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు
ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది
వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు.
రాక్షస రాజు బలి
చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి
శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు
లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి
వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి,
తానెవరో చెబుతుంది. తన
భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన
రాజ్యాన్ని వదిలి, మానవులకు
విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.
అలెగ్జాండర్
భార్య 'రోక్సానా' తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా
భావించి రాఖీ కడుతుంది. విశ్వవిజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్
క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై
దండెత్తివచ్చాడు. ఆ క్రమంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ
వివాహబంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని
భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు.
పురుషోత్తముడిపై
దండెత్తిరావాలని అలెగ్జాండర్ను అంబి ఆహ్వానించాడు. దీంతో జీలం నది వడ్డున
పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. పురుషోత్తముడి
పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా ఆయనను తన అన్నలా
భావించి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని
కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం చిక్కినా తన చేతికున్న రాఖీచూసి
పురుషోత్తముడు విరమించుకున్నాడు.