Advertisement

‘వైఎస్సార్‌ వేదాద్రి’ ఎత్తిపోతల పథకం

By: Dimple Fri, 28 Aug 2020 3:10 PM

‘వైఎస్సార్‌ వేదాద్రి’ ఎత్తిపోతల పథకం

‘వైఎస్సార్‌ వేదాద్రి’ ఎత్తిపోతల పథకానికి వీడియో లింక్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఆయన రైతులకు ప్రయోజనం చేకూర్చే ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోతేవాలనే సంకల్పం కార్యాచరణలోకి వస్తుందన్నారు. వేదాద్రి నుంచి మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్‌మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలో ఉన్న నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాలు తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

‘‘అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడం లేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం.

డీబీఆర్‌ బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితో పాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా ‘వైఎస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం’ ద్వారా నీరు అందిస్తామని’’ సీఎం వెల్లడించారు. దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రూ.490 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని సీఎం‌ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement